Varanasi Event
Entry restricted to registered participants only.
శివాయ విష్ణు రూపాయ:
“ఏకమేవాద్వితీయం బ్రహ్మ”, “ ఏకోదేవః శివోవా కేశవోవా” అని శాస్త్ర వచనములు. ఆ పరబ్రహ్మ ని శివునిగా కొలిచినా, విష్ణువు గా కొలిచినా, వారు ఇద్దరు ఒక్కటే అని అర్థం. వీరి అభేద్యాన్ని చాటుతూ విష్ణు సహస్రనామం లో “సర్వః శర్వః శివః స్థాణుః” అని శివుని నామాలు కలవు. అటులే శివ పూజకి అతి ప్రధానమైన రుద్ర నమక ప్రశ్న లో “నమో భగవతే రుద్రాయ విష్ణవే ….” అన్న శృతి వచనం, “రుద్రాణాం శంకరశ్చాస్మి” అని భగవద్గీత లో కృష్ణ పరమాత్మ కూడా ఈ అభేదాన్నే వెల్లడించారు. “యథాంతరం న పశ్యమి తథామే స్వస్తిరాయుషి” అన్న శాస్త్ర సూత్రం కూడా వీరి మధ్య ఎవరైతే భేదం చూడరో వారికి అన్ని శుభములు చేకూరుతాయి అని ఎలుగెత్తి చాటుతున్నాయి. భేదం చూపడం అపచారము అని కూడా పురాణాలు చెబుతున్నాయి.
మనలో ఈ అభేద తత్వాన్ని పెంపొందించడానికి KCDT ద్వారా రూపొందించబడిన అద్భుత ఉపాసనావకాశం కాశీ లో జరగబోయే ఈ వినూత్నమైన కార్యక్రమం.
కాశీ విశిష్టత:
కాశీ క్షేత్రం అతి ప్రసిద్ధమైన శైవ క్షేత్రం గా సనాతన సంప్రదాయస్తులందరికీ తెలిసినదే. ఈ అవిముక్త క్షేత్రం శివునికి ఎంత ప్రీతిపాత్రమైనదో, అంతే విష్ణువు కి కూడా. ఈ క్షేత్రమందు విష్ణువు బిందుమాధవునిగా, ఆదికేశవునిగా వెలిసి అనాదిగా భక్తులని అనుగ్రహించుచున్నాడు. ఆ పరమశివుడే కాశీలో మరణించిన వారికి రామ తారక మంత్రమును ఉపదేశించును. ఈ క్షేత్రమందే తులసీదాసు వంటి పరమవైష్ణవులు నడయాడి వారి వాజ్ఞ్మయం ద్వారా ఇరువురినీ స్తుతించారు. అలా ఈ ఆనందవన క్షేత్రము అద్వైతానికి ప్రతీక గా నిలిచింది.
విష్ణు సహస్రనామ మహిమ:
“గేయం గీతా నామ సహస్రం” అని శంకరులు భజ గోవిందం లో మనుష్యులకి ముక్తి మార్గమును ఉపదేశించారు. విశేషంగా విష్ణు సహస్రనామ భాష్యమును కూడా రచించారు. “కలౌ కేశవ కీర్తనం” వంటి ప్రమాణ వాక్యములు కూడా నామ మహిమ ని ఈ కలిలో ఉత్కృష్టమైనది గా పేర్కొన్నాయి. మనకి ఈ జీవితం లో కావలసిన అన్ని కామ్యములు మరియు మోక్షము కూడా ఈ ఉపాసన మాత్రం చేతనే లభించగలవు.
రుద్ర మహిమ:
శ్రీరుద్రం అనే యజుర్వేద మంత్ర సంపుటి శివార్చన లో ప్రప్రథమం. శివుని ఉద్దేశించి చేసే హోమ, జప, అభిషేకాదులన్నిటిలో ఈ రుద్ర మంత్రాలనే ఉపయోగించడం అనాదిగా వస్తున్న ఆచారం. పంచాక్షరి, మృత్యుంజయ మంత్రములు వంటి ప్రధాన వైదిక మంత్రములు కూడా దీనియందే వెల్లడించబడినవి. ఇటువంటి మహత్తరమైన మంత్రమును కాశీ వంటి క్షేత్రమున జపించిన సకల అభీష్టములు సిద్ధించును.
లక్ష రుద్రాక్షార్చన:
త్రిపురాసుర సంహారానంతరము పరమశివుని చక్షువుల నుండి జారిన బిందువులు భూమి మీద పడి రుద్రాక్షలు గా ఆవిర్భవించాయి అని పురాణ ప్రతీతి. ఈ రుద్రాక్షలతో శివుని అర్చించినా, వాటిని ధరించినా అవి మనకు ఒక రక్షణను ఏర్పరచి శీఘ్రంగా శివానుగ్రహమును అందజేస్తాయి. కాశీ వంటి క్షేత్రము న విశ్వనాథుని సన్నిధి లో ఇటువంటి మహత్తరమైన అర్చన చేసుకోగలగటం మన భాగ్యం అని మనము భావించాలి.
ఇంతటి మహత్తరమైన కార్యక్రమములో మనము పాల్గొనే అవకాశము ఎంతో పుణ్యము వల్ల కానీ సాధ్యము కానిది. ఇటువంటి కార్యములో మనము భాగస్వాములమయ్యి ఆ శివకేశవుల కరుణకు పాత్రులు కావలెనని మన పూజ్య గురుదంపతి సంకల్పము. ఈ అవకాశమును సద్వినియోగపరచుకొన మనవి.
Register for freeEntry restricted to registered participants only.